CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలో ఓ విద్యార్థిగా మారనున్నారు. తరగతి గదిలో కూర్చొని టీచర్ చెప్పే పాఠాలు విననున్నారు. అయితే అది స్కూలో, కాలేజీయో కాదులెండి.
అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)లో నిర్వహించే ఓ లీడర్ షిప్ కోర్సులో సీఎం చేరనున్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ – ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించే ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ (Leadership for the 21st Century) అనే ఈ కోర్సులో సీఎం రేవంత్ రెడ్డి చేరనున్నారు.
ఆదివారం మేడారం పర్యటనను విజయవంతంగా ముగించిన సీఎం, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సుకు హాజరవుతారు. ఆ సదస్సు అనంతరం జనవరి 23న ఆయన అమెరికాకు బయలుదేరనున్నారు.
మసాచుసెట్స్ లోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ క్యాంపస్లో జనవరి 25 నుంచి 30 వరకు జరిగే వారం రోజుల ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో ఆయన పాల్గొంటారు. నిజ జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పాలన, రాజకీయ, సామాజిక సవాళ్ల పరిష్కారం గురంచి ఈ కోర్సు వివరిస్తుంది.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు మాత్రమే ఈ కోర్సుకు అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసి ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఇండియా నుంచి ఈ కోర్సుకు ప్రత్యక్షంగా హాజరయ్యే తొలి ముఖ్యమంత్రి ఈయనే.










