Satellite Based Toll Charge | ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి లక్షల మంది ఆంధ్ర ప్రదేశ్ కి వెళుతుంటారు. ఏపీ వాసులే కాకుండా తెలంగాణ వారు సైతం సంక్రాంతి వేడుకలు చూసేందుకు వెళతారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుంటుంది.
ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండగకు టోల్ గేట్ల్ వద్ద రద్దీని తగ్గించే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
వాహనాలు ఆగకుండానే, కేవలం మూడు సెకన్లలో టోల్ వసూలు చేసేందుకు వీలుగా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ విధానాన్ని పరీక్షిస్తోంది.
ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే 8 టోల్ బూత్లలో ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ విధానంలో కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్ను గుర్తించగానే, సెన్సార్లు ఫాస్టాగ్ను స్కాన్ చేసి ఆటోమేటిక్గా టోల్ రుసుమును వసూలు చేస్తాయి.
ఈ పరీక్షల సమయంలో కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగ్గా కట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలను అధికారులు గుర్తించారు. పండుగ రద్దీ ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు ఎన్హెచ్ఏఐ, టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.










