Bronze statue of Korean Queen Heo Hwang-ok unveiled in Ayodhya | శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యకు కొరియా దేశానికి శతాబ్దాల పురాతన సంబంధం ఉంది. ఇక్కడ జన్మించిన ఓ రాణి ఆ తర్వాత కొరియా రాజును వివాహం చేసుకున్నారు. అలాగే భారతీయ సంస్కృతిని, బుద్దిజాన్ని కొరియా ప్రజలకు పరిచయం చేశారు. అంతేకాదు ఆ దేశంలో సుమారు 60 లక్షల మంది ఈ రాణి వారసులే కావడం విశేషం. గురువారం అయోధ్యలో ఈ మహారాణి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దక్షిణ కొరియా రాణి హెయో హ్వాంగ్ ఓక్ కు చెందిన కాంస్య విగ్రహాన్ని తాజగా ఆవిష్కరించారు.
ఇది భారత్-కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. కొరియా పురాతన గ్రంథం సామ్ గుక్ యూసా ప్రకారం అయుత రాజ్యం అయిన అయోధ్య కు చెందిన సూరి రత్న అనే రాణి క్రీ.శ. 48లో సముద్ర మార్గాన కొరియాకు వెళ్లారు. అక్కడి రాజు కిమ్ సూరోను పెళ్లి చేసుకుని గాయ వంశానికి మూలం అయ్యారు. ఈ వంశానికి చెందిన వారు కొరియాలో ప్రస్తుతం 60 లక్షలకు పైనే ఉన్నారు. ఇప్పటికీ ఏటా కొరియా నుండి ప్రజలు అయోధ్యకు వచ్చి రాణిని స్మరించుకుంటారు. 12 అడుగుల ఎత్తు, 1300 కేజీల బరువున్న కాంస్య విగ్రహాన్ని తాజగా ఆవిష్కరించారు. 2001లో కొరియా ప్రతినిధులు అయోధ్య సరయూ నది తీరంలో రాణి పేరిట స్మరకాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కొరియా పార్క్ అని పిలుస్తారు.










