Ambati Rambabu Praises TTD Annaprasadam | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై ప్రశంసల వర్షం కురిపించారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం మహా అద్భుతం అని కొనియాడారు. తాజగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి వెళ్లారు.
భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నప్రసాదం చాలా రుచికరంగా ఉందని, భవనాన్ని అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసాదం స్వీకరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సాధారణ రోజుల్లో 90 వేల మంది భక్తులకు, ప్రత్యేక రోజుల్లో లక్ష 40వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు తాను తెలుసుకుని ఆశ్చర్య పోయినట్లు అంబటి వివరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అందించిన విరాళాలు ఇప్పుడు రూ 2,700 కోట్ల వరకు ఉన్నాయని వీటి ద్వారా వచ్చే వడ్డీ డబ్బులతోనే అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు ఒక వీడియోను చేసి సోసిల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.










