Venezuelan Leader Maria Corina Machado Awarded Nobel Peace Prize 2025 | ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు శాంతి బహుమతి దక్కాలని విశ్వ ప్రయత్నాలు చేశారు.
అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనూ కాకుండా వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడోను శాంతి బహుమతికి ఎంపిక చేస్తూ నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటన చేసింది. వెనుజువెల దేశంలోని నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వాయం కోసం శాంతి మార్గంలో ఎన్నో పోరాటాలు మరియా చేసిందని నోబెల్ కమిటీ పేర్కొంది. దేశ ప్రజల హక్కుల కోసం మరియా అవిశ్రాంత పోరాటం చారిత్రాత్మకం అని తెలిపింది.
వెనుజువెలలో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో ఆమె ఎన్నో బెదిరింపులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిన తీరు ప్రపంచానికే స్ఫూర్తి అని కమిటీ వెల్లడించింది. అలాగే గత ఏడాది కాలంగా ఆమె అజ్ఞాతంలో జీవించాల్సిన పరిస్థితి వచ్చిందని నోబెల్ కమిటీ పేర్కొంది.
ఈ క్రమంలో ఆమెను ఈ పురస్కారం కోసం కమిటీ ఎంపిక చేసింది. మొత్తం వ్యక్తులు, సంస్థలు కలిపి 338 నామినేషన్లను కమిటీ పరిశీలించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడినట్లు ట్రంప్ చాటింపు వేసుకున్నా ఆఖరికి ఆయనకు నిరాశే ఎదురైంది.










