Vijay rally stampede News | టీవీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కోలీవుడ్ అగ్ర నటుడు విజయ్ నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించడం ఘోర విషాదంగా మారింది. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మరణించిన వారిలో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ సెప్టెంబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నామక్కల్ లో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కరూర్ లోని వేలుసామిపురంలో రాత్రి 7.30 గంటలకు ర్యాలీలో పాల్గొన్నారు.
అయితే సుమారు 6 గంటలు ఆలస్యంగా విజయ్ అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తుండగానే జనం ఒక్కసారిగా విజయ్ సమీపానికి వచ్చేందుకు యత్నించారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. తొలుత కొందరు పిల్లలు తప్పిపోయారు ఆ తర్వాత మహిళలు ఈ క్రమంలోనే పలువురు స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
ప్రజల్ని అదుపు చేసేందుకు విజయ్ వారించినా అప్పటికే చేయి దాటిపోయింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని బయటకు తీసుకు వచ్చేందుకు సిబ్బంది చాలా కష్టపడ్డారు. బాధితుల్ని పైకెత్తిపట్టుకుని రద్దీ మధ్య నుండి బయటకు తీసుకువచ్చారు. కానీ క్షణాల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది చిన్నారులు సహా 39 మంది మరణించారు. మరో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.










