Telangana Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులపై సీఎస్ కె. రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పలు జిల్లాల్లో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.









