Maoist Sujathakka News | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న సుజాతక్క పై రూ.కోటి రివార్డు ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్య ఆమె బయటకు వచ్చారు.
శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర డీజీపీ జితేందర్ సమక్షంలో సుజాతక్క లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందించారు. అలాగే మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు సుజాతక్క. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత అయిన కిషన్ జీ సతీమణి సుజాతక్క. 2011 లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో కిషన్ జీ మరణించారు. ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పోతుల కల్పన తొలుత ఆర్ఎస్యూ మరియు జననాట్య మండలిలో పనిచేశారు. అనంతరం మావోయిస్టు పార్టీలో చేరారు. 2001లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.










