Ilaiyaraaja Gifts Rs.4 Crore Diamond Crown To Goddess Mookambika Of Karnataka | దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని కొల్లూరు క్షేత్రంలో కొలువైన మూకాంబిక అమ్మవారి పట్ల అచెంచలమైన భక్తి కలిగున్నారు.
తాజగా అమ్మవారికి రూ.4 కోట్ల విలువచేసే ఆభరణాలను సమర్పించారు. ఇళయరాజా తన కుమారుడు కార్తీక్రాజా, మనవడు యతీష్తో కలిసి బుధవారం కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా, అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటం (వజ్రకిరీటం)ను, అలాగే వీరభద్రస్వామికి వెండి కిరీటం మరియు ఖడ్గాన్ని అందజేశారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఇళయరాజా కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, అర్చకులు ఇళయరాజాకు తీర్థప్రసాదాలు మరియు అమ్మవారి ఫోటోను అందజేశారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ జగన్మాత మూకాంబికా అమ్మవారి ఆశీస్సులతోనే తనకు ఇంతటి కీర్తి ప్రతిష్టలు చేకూరినట్లు పేర్కొన్నారు.










