CM Revanth Reddy Tweet On TGSRTC | తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు.
ఈ పథకం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణలో 200 కోట్ల జీరో టికెట్లు ఇచ్చినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం పేర్కొన్నారు. “కొందరు” ఎగతాళి చేసినా… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం… ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి… ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి… ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది. ఈ ఒక్క పథకం వల్ల… ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని… పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని… ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని… అదే ఆర్టీసీలో పని చేస్తున్న… ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు… నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి.
ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి… జారి పోతుందనే పరిస్థితి… అక్కడ నుండి మొదలైన ప్రయాణం… నేడు 200 కోట్ల జీరో టికెట్లతో… ఆడబిడ్డలకు సాయం చేసి… ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. సంస్థ యాజమాన్యానికి… మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు నా ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’ అని సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.










