BCCI To Take A Call On Sunil Gavaskar’s IPL With No Cheerleaders, DJ’s Suggestion | భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 ఎడిషన్ మే 17 నుండి తిరిగి ప్రారంభం కానుంది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు-కోల్కత్త మ్యాచ్ తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ బీసీసీఐ కి కీలక సూచన చేశారు. జమ్మూకశ్మీర్ పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి మూలంగా 26 మంది పర్యాటకులు మరణించారు.
ఈ నేపథ్యంలో తమవారిని కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఎటువంటి హంగూ, ఆర్భాటం లేకుండా మిగిలిన ఐపీఎల్ మ్యాచులను నిర్వహించాలని గావస్కర్ బీసీసీఐ సూచన చేశారు. చీర్ లీడర్స్, డీజేలు లేకుండానే మిగిలిన మ్యాచులను నిర్వహించాలన్నారు.
సునీల్ గావస్కర్ సూచనను బీసీసీఐ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 17 నుండి జరగబోయే లీగ్, ప్లేఆప్స్ మ్యాచులు డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఐపీఎల్ లో మరో 17 లీగ్ మ్యాచులు, క్వాలిఫైర్ 1, 2, ఎలిమినేటర్ మరియు ఫైనల్స్ జరగాల్సి ఉంది.
ఢిల్లీ, జైపూర్, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ వేదికగా మాత్రమే మిగిలిన మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ వెల్లడించింది. మే 29 నుండి ప్లేఆప్స్ మొదలవుతాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది.