Operation Sindoor LIVE Updates | భారత ఆర్మి ‘ఆపరేషన్ సింధూర్’ తో పాకిస్థాన్ పై విరుచుకుపడింది. ఆ దేశంలో నక్కి భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదుల మీదకు మరియు వారు తల దాచుకున్న ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది.
త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించాయి. జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని పర్యాటక ప్రాంతమయిన బైసరన్ లో గత నెల పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారు.
అప్పటి నుండి ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకున్నాడు. భారత ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులువేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత ఆర్మి విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించింది.
సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థల క్యాంపులను ఆర్మి నేలమట్టం చేసింది. ఇందులో 70కి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే పాక్ ఆర్మీ స్థావరాలపై గాని, సామాన్య ప్రజలపై కానీ ఎటువంటి దాడి చేయలేదని భారత సైన్యం స్పష్టం చేసింది.
కాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం, ఆర్మి చేపట్టిన ఈ ఆపరేషన్ పట్ల భారత వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. పహల్గాంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందని కామెంట్లు వస్తున్నాయి.










