Janasena Jayakethanam Sabha | ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan ) స్థాపించిన జనసేన పార్టీ శుక్రవారం 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోంటోంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పవన్ అధికారంలోకి వచ్చిన నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులంతా పిఠాపురంలోనే సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేన చిత్రాడ బహిరంగ సభ పరిసరాలను పార్టీ వినూత్నంగా తయారు చేసింది.
సభ జరిగే ప్రాంగంణలోకి వెళ్లే ద్వారాలకు పిఠాపురం మహారాజు పేరు, తెలుగు ప్రజలకు సేవలు అందించిన ప్రముఖుల పేర్లు పెట్టారు. జయకేతనం అనే ఈ సభ పేరును అన్ని భారతీయ భాషల్లో రాయించారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
చిత్రాడ ప్రాంతం అంతా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. జయకేతనం సభకు విచ్చేసే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, నీరు అందించడంతోపాటు ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.










