Rain Alert For Telangana | భానుడి భగభగలతో తల్లడిల్లిపోతున్న తెలంగాణ ప్రజలకు ఎట్టకేలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త వచ్చింది.
గత వారం పది రోజులుగా ఎండ, వడగాల్పులతో విసిగిపోయిన ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(Rain Alert For Telangana) రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వివరించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
అయితే మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలు వీస్తాయని తెలిపింది.
ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. మంగళవారం విజయవాడ భారీ వర్షం కురిసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో దక్షిణభారతదేశమంతా రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.










