PM Modi Hooghly river cruise | పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం కోల్కతాలోని హుగ్లీ నదిలో ప్రయాణించి, గంగా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెంగాలీ జీవనశైలిలో అంతర్భాగమైన గంగా నది తీరంలో గడుపుతూ, అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తట్టిలేపేలా మోదీ వ్యాఖ్యలు చేశారు.
“ప్రతి బెంగాలీ హృదయంలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్ ఆత్మలోనే గంగ ప్రవహిస్తుందని చెప్పవచ్చు. గంగా మాతకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ఉదయం హుగ్లీ తీరంలో గడిపాను” అని ప్రధాని తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రధాని స్థానిక పడవ నడిపే వారితో మాట్లాడారు. వారి కష్టార్జితాన్ని ప్రశంసిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉదయాన్నే వాకింగ్కు వచ్చిన స్థానికులతో ముచ్చటించారు.
హుగ్లీ నది సోయగాలను, విద్యసాగర్ సేతు మరియు హౌరా బ్రిడ్జ్ అందాలను ప్రధాని స్వయంగా తన కెమెరాలో బంధించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, బెంగాలీ ప్రజల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
టీఎంసీ తరచుగా బీజేపీని ‘బయటి వ్యక్తుల పార్టీ’ (Outsiders) అని విమర్శిస్తోంది. దీనికి కౌంటర్ గానే ప్రధాని గతంలో ‘ఝాల్ మురీ’ తినడం, ఇప్పుడు హుగ్లీ నదిలో గంగ పూజలు చేయడం ద్వారా తాను బెంగాలీ సంస్కృతికి ఎంత దగ్గరో చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.






