Harish Rao Slams Congress Govt Over Governor Speech In Assembly | తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి.
తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. కాగా గవర్నర్ ప్రసంగంపై బీఆరెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందులో భాగంగా గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదన్నారు మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు హరీష్ రావు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు..ఇట్ల అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించిందని మండిపడ్డారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని చెప్పారు. రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ ని కూడా వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
“నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే” అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారని, కానీ నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం డిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లు హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కుల సర్వే చేసినం అంటున్నారని కానీ ఆ సంఖ్య మీద బీసీ సంఘాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప, వాస్తవ లెక్కలు బయటికి చెప్పడం లేదని హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు.