- 7 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి!
Gachibowli Building Collapse | నగరంలోని గచ్ఛిబౌలి పరిధిలోని అంజయ్యనగర్లో శనివారం తీవ్ర భయాందోళనకరమైన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్మించిన ఏడు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
అసలేం జరిగింది?
నాలా పక్కనే ఉన్న కేవలం 50 గజాల చిన్న స్థలంలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుని, అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏడు అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా నేలమట్టమైంది.
ఈ ప్రమాదంలో భవనం శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు.
భవనం కూలిపడే సమయంలో దాని శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడటంతో అపార్ట్మెంట్ గోడలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో అపార్ట్మెంట్లోని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
భవనం కూలిన శబ్దానికి పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ఒకవేళ ఈ ప్రమాదం సాయంత్రం సమయంలో జరిగి ఉంటే ప్రాణనష్టం మరిన్ని రేట్లు ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.











