Maharashtra Zipline Accident | మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా టోరణ్మాల్ హిల్ స్టేషన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సీతాఖాయ్ పాయింట్ వద్ద 3,500 అడుగుల లోతైన లోయపై ఏర్పాటు చేసిన జిప్లైన్లో ఓ పర్యాటకుడు మధ్యలోనే చిక్కుకుపోయాడు.
ఇటీవల ప్రారంభించిన ఈ అడ్వెంచర్ జిప్లైన్పై ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మికంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అతడు గాల్లోనే నిలిచిపోయాడు.
పర్యాటకుడు లోయపై వేలాడుతూ ఉండటంతో అక్కడ కొంతసేపు ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, ఇతర పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న జిప్లైన్ నిర్వహణ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రతా పరికరాల సహాయంతో తీవ్ర శ్రమ అనంతరం పర్యాటకుడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనలో అతడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్లు సమాచారం.
జిప్లైన్లో తలెత్తిన సాంకేతిక సమస్యకు గల కారణాలను నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అడ్వెంచర్ టూరిజం నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.







