Actor Tanish meets Pawan Kalyan | టాలీవుడ్ హీరో, యువ నటుడు అల్లాడి తనీష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ను వ్యక్తిగతంగా కలవడం తన 27 ఏళ్ల జీవితంలో ఇదే తొలిసారి అని తనీష్ పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆయన పెట్టిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పవన్ కల్యాణ్తో భేటీ సందర్భంగా ఇద్దరి మధ్య పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా “మనం కలిసి పనిచేద్దాం” అని పవన్ కల్యాణ్ అన్న మాటలు తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోతాయని తనీష్ ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ గారిని క్లోజ్గా చూసిన తర్వాత, ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకున్న తర్వాత తనలో సరికొత్త అనుభూతి, ఉత్సాహం కలిగాయని చెప్పారు.
పవన్తో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా షేర్ చేసిన తనీష్.. “ఈ జన్మకు ఇంతకన్నా ఏం కావాలి.. కట్టెకాలేంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటా” అంటూ పెట్టిన క్యాప్షన్ మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణ జనసేనలో యాక్టివ్..
నిజానికి నటుడు తనీష్ కేవలం సినిమా పరంగానే కాకుండా, రాజకీయంగానూ జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ తెలంగాణ విభాగంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం తనీష్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆయనకు పవన్ కల్యాణ్ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం.











