Monday 13th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మూగబోయిన మధుర గాత్రం.. దిగ్గజగాయని ఆశా భోంస్లే కన్నుమూత!

మూగబోయిన మధుర గాత్రం.. దిగ్గజగాయని ఆశా భోంస్లే కన్నుమూత!

Asha Bhosle

Asha Bhosle Is No More | భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, పద్మవిభూషణ్ ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12, 2026) సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

ఆమె మృతితో భారతీయ సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయింది.

సాంగ్లీ నుంచి ప్రపంచ స్థాయి వరకు..
1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక కళాకారుల కుటుంబంలో ఆశా జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నుండి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె, తన అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లో నడిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1943లో మరాఠీ చిత్రం ‘మజాబ్’తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 14 భాషల్లో వేలాది పాటలను ఆలపించారు.

‘దమ్ మారో దమ్’ వంటి వెస్ట్రన్ స్టైల్ పాటల నుండి మెలోడీల వరకు ఆమె పాడని జానర్ లేదు. 1980ల నుండి 2007 వరకు తెలుగులో అనేక సూపర్ హిట్ పాటలను ఆమె పాడారు. మన నేటివిటీకి తగ్గట్టుగా ఆమె పలికించిన తెలుగు పదాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు..
వృత్తిరీత్యా ఎంతో కీర్తిని గడించినా, ఆశా గారి వ్యక్తిగత జీవితం పూల బాట కాదు. కేవలం 16 ఏళ్ల వయసులో, కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా 32 ఏళ్ల గణపతిరావును వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అత్తింటి వేధింపులు, కుటుంబ కలహాలను ఆమె మౌనంగా భరించారు.

ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ (పంచమ్ దా)ను వివాహం చేసుకున్నారు. 1994లో ఆయన మరణించిన తర్వాత, తన పిల్లలే లోకంగా ఆమె జీవనం సాగించారు.

ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. చిత్ర పరిశ్రమలోని అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్ వంటి మరెన్నో అవార్డులు ఆమెను వరించాయి.

ప్రముఖుల నివాళులు..
ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. “ఆమె గొంతు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది” అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions