Joint Tax Filing Proposal By Raghav Chadha | దేశంలోని మధ్యతరగతి వేతనజీవులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులైన దంపతులకు భారీ ఊరటనిచ్చేలా ఆసక్తికర ప్రతిపాదన వినిపించింది.
ప్రస్తుత ఆదాయపు పన్ను విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూ, పెళ్లైన జంటల కోసం ‘జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్’ విధానాన్ని తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆదాయం ఒకటే.. పన్నుల్లో ఎందుకీ తేడా?
సభలో రాఘవ్ చద్దా ఒక లాజికల్ పాయింట్ను వివరించారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరో ₹10 లక్షలు సంపాదిస్తే, ప్రస్తుత మినహాయింపుల ప్రకారం ఆ కుటుంబంపై పెద్దగా పన్ను భారం ఉండదు.
కానీ, అదే కుటుంబంలో భార్య లేదా భర్త.. కేవలం ఒక్కరే ₹20 లక్షలు సంపాదిస్తే మాత్రం ప్రభుత్వం సుమారు ₹1.92 లక్షల పన్ను వసూలు చేస్తోంది.
కుటుంబ ఆదాయం (Family Income) ఒకేలా ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఫైలింగ్ వల్ల ఇలాంటి ఆర్థిక అసమానతలు వస్తున్నాయని ఆయన విశ్లేషించారు.
కుటుంబ ఆదాయమే ప్రాతిపదిక కావాలి.. సంపాదనను వ్యక్తిగత ఆదాయంగా కాకుండా ‘కుటుంబ ఆదాయంగా’ పరిగణించాలని రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు.
ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జాయింట్ ఫైలింగ్ విధానం అమల్లో ఉందని, దీనివల్ల జంటలపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా పెరిగిన ధరల దృష్ట్యా మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరట అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.






