Minister Ponguleti Announces Rs.5 Lakh Ex Gratia to Victims Families as Nampally Fire Kills Five | నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన నియంత్రణ చర్యలు అమలు చేస్తామని తెలిపారు.










