Tamil Nadu Governor R.N. Ravi walks out of Assembly | తమిళనాడు శాసనసభలో మంగళవారం ఉదయం హై డ్రామా నెలకొంది. అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అలపించకుండా అవమానించారని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే గవర్నర్ తీరు రాష్ట్ర ప్రజలను, తమిళ సంస్కృతిని అవమానించే విధంగా ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం తమిళనాడు శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. సంప్రదాయంగా సభ గవర్నర్ ప్రసంగంతో మొదలవుతుంది. అయితే సభకు హాజరైన గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు. తమిళనాడు రాష్ట్ర గేయం ఆలపించిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాలని స్పీకర్ ను కోరినా నిరాకరించారని గవర్నర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల శాసనసభల్లో గవర్నర్ ప్రసంగానికి ముందు, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారని కానీ ఇక్కడ అలా జరగలేదని లోక్ భవన్ పేర్కొంది.
గవర్నర్ ప్రసంగం సమయంలో పదే పదే మైక్ ను ఆపేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో అసత్యాలు ఉన్నాయని లోక్ భవన్ ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగినప్పటికీ వాటిని ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపిస్తూ గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు గవర్నర్ వాకౌట్ పై సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇది తమిళ ప్రజలను అవమానించడమే అని అన్నారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తమిళ సంస్కృతిని అవమానించినందుకు గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా గతంలోనూ గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే.










