UK MP Bob Blackman Calls for Integration of Entire Jammu & Kashmir with India | బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాకమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేయాలని స్పష్టం చేశారు. అక్రమంగా కశ్మీర్ ను ఆక్రమించడమే కాకుండా పీఓకేలో ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. పీఓకేతో సహా కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో విలీనం చేయాలని కుండబద్దలు కొట్టారు. తాను మొదటి నుండి ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నట్లు తెలిపారు. 1992లో కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తమ నివాసాల నుంచి తరిమివేయడానికంటే ముందే ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
1992లో కాశ్మీరీ పండితుల వలసల సమయంలో భారీ సమావేశాలు ఏర్పాటు చేసి, మతం, నేపథ్యంలో ఆధారంగా తమ పూర్వీకుల ఇళ్ల నుంచి పండితులను తరిమేయడం అన్యాయమని వివరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాజస్థాన్ జైపూర్ లోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరిగిన హై-టీ కార్యక్రమంలో బ్రిటీష్ ఎంపీ బాబ్ బ్లాకమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్ పై వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఈ ఎంపీ భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందని దాయాధి పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.










