Anand Mahindra Tweet | ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ రావడంతో ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఏఐ కారణంగా అనేక మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోవడం మాట అటుంచితే దీనికంటే పెద్ద సంక్షోభం మన ముందు ఉందన్నారు.
వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతే భవిష్యత్తులో అసలైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’ సీఈవో జిమ్ ఫార్లే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోర్డ్ లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలా వాటికి వార్షిక వేతనం రూ. కోటి (1,20,000 డాలర్లు)కి పైగా ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని మహీంద్రా పేర్కొన్నారు.
ఇది కేవలం ఫోర్డ్ కంపెనీకే పరిమితం కాదని, అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
కొన్నేళ్లుగా మన సమాజం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చిందని, నైపుణ్యం ఆధారిత శ్రామిక శక్తిని విస్మరించిందని మహీంద్రా విశ్లేషించారు. నైపుణ్యం, అనుభవం, నేర్పు అవసరమైన ఈ కార్మిక శక్తి నిర్వహించే పనులను ఏఐ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.
ఇది ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచాన్ని నిర్మించే, నడిపించే, మరమ్మతులు చేసే నైపుణ్యం ఉన్నవారే ‘ఏఐ యుగంలో’ అతిపెద్ద విజేతలుగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
నైపుణ్యం, కొరత కారణంగా కార్మికులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, ఇది హింస ద్వారా కాకుండా నైపుణ్యం ద్వారా వచ్చే విప్లవమని కార్ల్ మార్క్స్ కూడా ఊహించి ఉండరు అంటూ ట్వీట్ చేశారు.










