CM Revanth Reddy News | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను తప్పించి ఆ కుర్చీని లాక్కోవడానికి హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హరీష్, కేటీఆర్ లకు పరిస్థితులు అర్ధం అవ్వాలని కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెప్పారు.
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసున నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని అలాగే ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో లేని, అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ ను విమర్శించడం భావ్యం కాదని తాను భావిస్తున్నట్లు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తిరిగి యాక్టీవ్ అయ్యాక తాను కచ్చితంగా స్పందిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు అసూయ, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని పేర్కొన్నారు. వారు తనకంటే వయసులో చిన్నవారని భవిష్యత్ లో ఇంకా చాలా ఏళ్ళు రాజకీయాలు చేయాల్సి ఉందన్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం మరింత పెరిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వం పై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం పార్టీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు.











