No Helmet No Petrol | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల్ని నియంత్రించడానికి మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. టూవీలర్ నడిపే వారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే పెట్రోల్ నింపొద్దని బంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఇందోర్ జిల్లా అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు.
టూ వీలర్ నడిపేవారు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టులు పెట్టుకొనేలా ఇందోర్ యంత్రాంగం ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్ చేపట్టాలని సప్రే ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే బంకుల్లో పెట్రోల్ నిరాకరించనున్నట్లు ఇందౌర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ తెలిపారు.
అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆయా పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ. 5వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.










