CM Revanth Reddy News | తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన సర్వే దేశానికే ఆదర్శం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సమగ్ర కులగణన సర్వే డేటా మొత్తం 88 కోట్ల పేజీల్లో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు. సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారని చెప్పారు. కులగణన సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ లేఖ తనకు నోబెల్, ఆస్కార్తో సమానమని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కులగణన సర్వే పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీ ఆది నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా విమర్శించారు.
తాను ముందు నుంచి కాంగ్రెస్ లో లేను, తనకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు సరదాగా అంటుంటారని సీఎం పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో తాను మమేకం అయినట్లు తెలిపారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మతః ఓబీసీ కాదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే, నరేంద్ర మోదీ సీఎం అయిన తర్వాతే తన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్పించుచుకున్నారని వెల్లడించారు.










