Priyanka Chaturvedi on match with Pak | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు.
అనంతరం పాకిస్థాన్ తో ద్వైపాక్షిక మరియు ఇతర సంబంధాలను భారత్ తెంచుకుంది. అయితే ఈ విషాదం నుంచి తెరుకోకముందే పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచులు ఏంటని ప్రశ్నించారు ఎంపీ, శివసేన యూబీటి నేత ప్రియాంక చతుర్వేది.
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇండియా ఛాంపియన్స్-పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చతుర్వేది స్పందించారు.
పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు ఉండవని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడేమైందని ఆమె ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేదు, కానీ ఇక్కడ భారత జట్టు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచు ఆడేందుకు తొందరపడుతోందని అసహనం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడిలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారి గురించైనా ఆలోచించరా అని నిలదీశారు. ఇలాంటి సమయంలో డబ్బుల కోసం బీసీసీఐ, ఐసీసీ వెంపర్లాడడం వారి దివాలతనాన్ని సూచిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.










