SLBC Tunnel Collapse News | నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రికి సీఎం తెలియజేశారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ( NDRF )బృందాన్ని పంపిస్తామని మోదీ ముఖ్యమంత్రికి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
అలాగే లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) సీఎం రేవంత్ కు ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ ప్రమాదం పై అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రతీ అవకాశాన్ని అన్వేషించాలని సూచించారు.