Justice Madhavi Devi emotional comments | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తనయుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగిన సుదీర్ఘ విచారణలో.. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు..
“ఈ కేసు విచారణ విషయంలో నాకు ఎవరో ఆశ చూపుతున్నారని, నన్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని న్యాయమూర్తి ఆవేదన చెందారు.
సోషల్ మీడియా పోస్టులపై స్పందిస్తూ.. ఒకవేళ ఫిర్యాదుదారు (బాధితుల) తరఫు న్యాయవాదికి నాపై నమ్మకం లేకపోతే లేదా ఏవైనా అభ్యంతరాలు ఉంటే తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి (Recuse) కూడా సిద్ధమేనని జడ్జి స్పష్టం చేశారు.
అయితే న్యాయమూర్తిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎలాంటి అభ్యంతరాలు లేవని ఫిర్యాదుదారు లాయర్ తెలపడంతో ఆమె విచారణను కొనసాగించారు.
పోక్సో కేసులో తనకు ముందస్తు బెయిల్ (Anticipated Bail) మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై తక్షణమే ఎలాంటి అనుకూల ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే, విచారణ పూర్తయ్యేలోపు పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించాలా? వద్దా? అనే అంశంపై వచ్చే వారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది.







