Yoga Day Countdown In LB Stadium | జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా హైదరాబాద్ లో 24 గంటల ముందు నుంచే ప్రత్యేక యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రముఖ నటినటులు సాయిధరమ్తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులంతా యోగాసనాలు వేశారు.
శనివారం ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించనున్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్తో ఈ ఏడాది యోగా డే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్బంగా విశాఖపట్నంలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 127 కంపార్ట్మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కంపార్ట్మెంట్లో వెయ్యిమంది చొప్పున పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ యోగాంధ్ర సందర్భంగా మొత్తం 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించే లక్ష్యం నిర్దేశించుకకుంది ఏపీ ప్రభుత్వం.