హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.
కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం వల్ల పెద్ద శస్త్ర చికిత్స జరుగనుంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతోపాటు తాము కూడా ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.