Eye witness recounts Kurnool bus accident | కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైన ఘటన ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవదహనం అయ్యారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు ప్రత్యక్ష సాక్షి హేమా రెడ్డి. ప్రమాదం జరిగిన తర్వాత ఈమనే తొలుత పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఒక వీడియో ద్వారా ఆ భయంకర క్షణాలను గుర్తుచేసుకున్నారు.
‘నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తన్న సమయంలో చిన్నటేకూరు వద్ద నేషనల్ హైవే 44 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏమైందా అని కారు దిగి చూస్తే ఓ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన కొందరు క్షతగాత్రులు రోడ్డుపై కూర్చొని తమవారు బస్సులోనే ఉన్నారు అంటూ రోధిస్తున్నారు. అక్కడే ఉన్న ఇతర వాహనదారులు మాత్రం తమ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. వెంటనే నేను కర్నూలు ఎస్పీ ఇతర అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. కర్నూలు రూరల్ ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ ఆరుగురిని మరో వ్యక్తి ప్రైవేట్ కారులో ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం తర్వాత బస్సులో మాంసపు ముద్దలు కాదు అస్థిపంజరాలే మిగిలాయి. ఆ దృశ్యాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి’ అని హేమా రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.










