Ex-Gratia For Victims Of Kurnool Bus Accident | కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్దమైన ఘటనలో 19 మంది సజీవదహనం అవ్వడం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. బస్సు బైక్ ను ఢీ కొట్టడం, ఆ తర్వాత బైక్ బస్సు కిందకు చొచ్చుకుని రావడంతో అగ్ని ప్రమాదానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు ప్రధాని.
‘ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.










