ఏపీ తీరంలో పరాయి బోట్లకు నో ఎంట్రీ
సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!
Chandrababu Naidu comments on fishermen | ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై, ఇక్కడి సముద్ర సంపదపై కేవలం ఏపీ మత్స్యకారులకే పూర్తి హక్కులు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మత్స్యకారులు ఏపీ తీరంలోకి ప్రవేశిస్తే ఊరుకునేది లేదని, వారిని వెంటాడి పట్టుకోవడం ఖాయమని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ‘మత్స్యకారుల సేవ’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్థానిక మత్స్యకారులకు పూర్తి భరోసా ఇస్తూ సరికొత్త సాంకేతిక వ్యూహాన్ని ప్రకటించారు.
పొరుగు బోట్లపై శాటిలైట్ నిఘా..
ఇతర రాష్ట్రాల బోట్లు మన సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే వాటిని గుర్తించడానికి ఆధునిక సాంకేతికతను వాడుతున్నట్లు సీఎం వెల్లడించారు.
కలెక్టర్కు అలర్ట్..
ఏపీ తీరంలోకి పరాయి రాష్ట్రాల బోట్లు రాగానే శాటిలైట్ సహాయంతో ఆటోమేటిక్గా స్థానిక జిల్లా కలెక్టర్కు సందేశం (Message) వెళ్తుంది. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ మరియు మత్స్యశాఖ అధికారులు అప్రమత్తమై సదరు అక్రమ బోట్లను సీజ్ చేస్తారని చంద్రబాబు వివరించారు. పరాయి రాష్ట్రాల వల్ల మన మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడానికి వీల్లేదని ఆయన నొక్కిచెప్పారు.
కూటమి సర్కారు మత్స్యకార ప్యాకేజీ
మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తూ సీఎం కొన్ని కీలక హామీలను, పథకాలను ప్రస్తావించారు. “తీరం మనదే, బోటు మనదే.. వేటా మనదే, ఇందులో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదు” అని మత్స్యకార సోదరులకు సీఎం ధీమా ఇచ్చారు.
రూ. 20,000 ఆర్థిక భరోసా..
సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో (Fishing Ban Period) మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 20,000లకు పెంచినట్లు సీఎం గుర్తుచేశారు.







