PIB Fact Check On Fake News | దేశంలో త్వరలోనే ఒక పెద్ద సంక్షోభం రాబోతోందని, అందుకే దేశ ప్రజలంతా వీలైతే “ఒక పూట భోజనం మానేయాలి” అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వైరల్ అవుతోంది.
పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ అస్థిరత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించిన తరుణంలో.. కొందరు కేటుగాళ్లు అమిత్ షా మార్ఫింగ్ ఫోటోలతో ఈ ఫేక్ న్యూస్ను సృష్టించారు.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ‘పీఐబీ ఫాక్ట్ చెక్’ (PIB Fact Check) విభాగం రంగంలోకి దిగి, అసలు నిజానిజాలను వెల్లడించింది.
ఇది పక్కా ఫేక్..
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్న ఈ కథనం పూర్తిగా నకిలీది (Fake News) అని పీఐబీ స్పష్టం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలను ఉద్దేశించి గానీ, మరే ఇతర వేదికల పైన గానీ ఇటువంటి వ్యాఖ్యలు లేదా ప్రకటనలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు కొందరు కావాలనే నకిలీ హెడ్లైన్స్తో కూడిన మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేస్తున్నారని తెలిపింది.
“సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేని నకిలీ వార్తలను ఫార్వర్డ్ చేయవద్దు. కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని, గుర్తింపు పొందిన వార్తా సంస్థల కథనాలను మాత్రమే నమ్మాలి.” : పీఐబీ ఫాక్ట్ చెక్ విభాగం







