Tamil Nadu political crisis | తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణ ఆహ్వానం పంపేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ నిరాకరించారు.
గత 24 గంటల్లో విజయ్ రెండోసారి గవర్నర్తో భేటీ అయినప్పటికీ, మెజారిటీ నిరూపించుకునే వరకు వేచి చూడాల్సిందేనని లోక్ భవన్ స్పష్టం చేసింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
అయితే టీవీకే ప్రస్తుతం 108 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ (5 ఎమ్మెల్యేలు) మద్దతుతో ఆ సంఖ్య 113కు చేరింది. మెజారిటీకి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండటంతో, “118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను తీసుకురండి” అని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 7వ తేదీ (గురువారం) ఉదయం 11 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ వేడుక తాత్కాలికంగా నిలిచిపోయింది.
సంఖ్యాబలం నిరూపించుకునేందుకు తాను సిద్ధమని, ఫ్లోర్ టెస్టుకు అవకాశం ఇవ్వాలని విజయ్ గవర్నర్ను కోరారు. అయితే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని గవర్నర్ భావిస్తున్నట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
కింగ్ మేకర్లుగా చిన్నాచితకా పార్టీలు..
మెజారిటీకి అవసరమైన ఐదు స్థానాల కోసం ఇప్పుడు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే నేతలు నిమగ్నమయ్యారు.
రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా, మెజారిటీ నిరూపితమైన తర్వాతే తదుపరి అడుగు వేయాలని గవర్నర్ నిర్ణయించడంతో.. విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.









