Paternity Leave As Legal Right | గత కొద్ది రోజులుగా అనేక సమస్యలపై రాజ్యసభలో తన గళం ఎత్తుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మరో డిమాండ్ లేవనెత్తారు. పితృత్వ సెలవులకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.
బిడ్డ సంరక్షణ అనేది కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, అది తల్లిదండ్రులిద్దరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు.
మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. పితృత్వ సెలవును దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో (ప్రైవేట్ సహా) చట్టబద్ధమైన హక్కుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“బిడ్డ పుట్టినప్పుడు ఇద్దరినీ అభినందిస్తారు, కానీ సంరక్షణ బాధ్యత మాత్రం చట్టపరంగా తల్లిపైనే పడుతోంది. ఇది చట్టం ద్వారా రుద్దుతున్న సామాజిక వైఫల్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రసవానంతరం మహిళకు శారీరక, మానసిక మద్దతు కోసం భర్త తోడు ఎంతో అవసరమని, ఆ సమయంలో భర్త ఉండటం విలాసం (Luxury) కాదని, అది ఒక అత్యవసరమని (Necessity) సభకు వివరించారు.
ప్రస్తుతం కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 15 రోజుల పితృత్వ సెలవు ఉందని, దేశంలోని 90 శాతం మంది పనిచేస్తున్న ప్రైవేట్ రంగంలో ఇలాంటి చట్టం లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.
స్వీడన్, ఐస్లాండ్, జపాన్ వంటి దేశాల్లో 90 రోజుల నుండి 52 వారాల వరకు పితృత్వ సెలవును చట్టబద్ధమైన హక్కుగా ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
బిడ్డ సంరక్షణ మరియు ఉద్యోగం ఈ రెండింటిలో తండ్రి దేనిని ఎంచుకోవాలనే క్లిష్ట పరిస్థితి రాకూడదని చద్దా అన్నారు.
తండ్రికి సెలవు ఇవ్వడం వల్ల కుటుంబ బంధాలు బలపడటమే కాకుండా సమాజంలో లింగ సమానత్వం పెరుగుతుందని, కాబట్టి వెంటనే ఈ దిశగా చట్టాన్ని తీసుకురావాలని కోరారు.






