- ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశం!
CID Notices To MLA Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID) షాక్ ఇచ్చింది.
సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఒక వివాదాస్పద ఘటనపై విచారణ నిమిత్తం ఆయనకు నోటీసులు జారీ చేసింది. కొత్త చట్టం BNSS సెక్షన్ 35(3) కింద ఈ నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
కేసు నేపథ్యం ఇదే..
హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 30/2026 ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. జాతర సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రోడ్డుపై కూర్చుని నిరసన తెలపడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్కు ఆటంకం కలిగిందని, తద్వారా భక్తులకు, సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నది ప్రధాన ఆరోపణ.
సీఐడీ నోటీసులో పేర్కొన్న అంశాల ప్రకారం కౌశిక్ రెడ్డిపై విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను అడ్డుకోవడంతో పాటు, వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం. బహిరంగ ప్రదేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం అనే ఆరోపణలు ఉన్నాయి.
సదరు ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిని సాక్ష్యాలుగా పరిగణించి సీఐడీ రంగంలోకి దిగింది. వచ్చే ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు.
విచారణకు వచ్చే సమయంలో తప్పనిసరిగా గుర్తింపు పత్రాలు (ID Cards) మరియు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు వెంట తీసుకురావాలని ఆదేశించారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని సీఐడీ హెచ్చరించింది.
నోటీసును బేఖాతరు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో, ఇది రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.






