CM Revanth Reddy Chit Chat | తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతకు ‘హైడ్రా’ (Hydraa), డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ‘ఈగల్’ (Eagle)ను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వాటి తరహాలోనే మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీ రాయుళ్లపై దృష్టి సారించారు. ఆహార కల్తీని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్రంలో త్వరలోనే ఒక శక్తివంతమైన, స్వతంత్ర హోదా కలిగిన నూతన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
ఆహార కల్తీ నియంత్రణ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కఠిన చట్టాలను అధ్యయనం చేస్తున్నామని, ఎవరూ తప్పించుకోలేని విధంగా అత్యంత పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని సీఎం తెలిపారు.
ప్రజల ఆకలిని, అవసరాలను సొమ్ము చేసుకునే వారిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ కొత్త విభాగం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం, కల్తీ చేయడం హత్యానేరం కంటే ఘోరమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, హోటళ్లు, తయారీ కేంద్రాలు, విక్రయశాలల్లో నిరంతర తనిఖీలు చేసేలా ఈ కొత్త వ్యవస్థకు విస్తృత అధికారాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది.






