Advocates Protection Bill | తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ఎంతో కాలంగా న్యాయవాదులు ఎదురుచూస్తున్న “తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్” ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
న్యాయవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో న్యాయవాది గట్టు వామనరావు దంపతులను పట్టపగలే అతి కిరాతకంగా హత్య చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఆ కేసులో అసలు దోషులను పట్టుకోకుండా, అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పోలీసులు విచారణను నీరుగార్చారని ఆయన ఆరోపించారు.
తమ రక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలని న్యాయవాదులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని స్పష్టం చేశారు.
ఒక న్యాయవాదిగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే, న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విధుల్లో ఉన్న వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించేలా నిబంధనలు రూపొందించారు. న్యాయవాదుల సంక్షేమం మరియు సంరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.






