Viral News | పెళ్లిపీటల పై పెళ్లికూతురు స్థానంలో ఆమె తల్లి కూర్చోవడం చూసిన వరుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..మీరట్ జిల్లాలోని బ్రహ్మంపురికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ అజిమ్ కు శామలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల మంతాశ తో నిఖా ఖరారయ్యింది. మార్చి 31 న పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. అయితే నిఖాలో మౌల్వీ వధువు పేరును తాహిరా అని పలికాడు.
ఇది గమనించిన వరుడికి అనుమానం వచ్చింది. వధువు ధరించిన ముసుగు తొలగించి చూడగా పెళ్లికూతురి స్థానంలో ఆమె తల్లి 45 ఏళ్ల తాహిరా దర్శనమిచ్చింది. ఇది చూసి వరుడు ఆశ్చర్యపోయాడు. వివాహ వేడుకలోనే నిరసనకు దిగాడు. అయితే పెళ్లికుమారుడి తరఫున పెద్దలుగా వ్యవహరించిన అతని సోదరుడు, వదిన వధువు కుటుంబంతో కలిసే ఈ కుట్ర పన్నారు.
భర్త మరణించిన 45 ఏళ్ల తాహిరాకు అజిమ్ తో వివాహం చేయాలని వారు పన్నాగం పన్నారు. అయితే ఈ విషయంలో ఆందోళన చేస్తే రేప్ కేసు పెడతామని వరుడిని వారు బెదిరించారు. అయినప్పటికీ అజిమ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కోసం తాను రూ.ఐదు లక్షలు ఖర్చు చేసినట్లు వాపోయాడు. తాజగా వస్తున్న సమాచారం ప్రకారం ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.










