10 Family Members of Masood Azhar Killed During Operation Sindoor | పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చావుదెబ్బ తిన్నా పిచ్చి ప్రేలాపణలు ఆపడం లేదు.
బుధవారం వేకువజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఐదు, పాకిస్థాన్ భూభాగంలో నాలుగు ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు దాడి చేశాయి.
జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో ఉగ్రవాది మసూద్ అజార్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. సరిహద్దుకు 100 కి.మీ. దూరంలో ఉన్న బహవల్ పూర్ లోని మర్కజ్ సుబాన్ పై సైన్యం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాడి చేసింది.
మర్కజ్ సుబాన్ స్థావరాన్ని జైషే మహమ్మద్ ఆపరేషల్ హెడ్ క్వాటర్స్ గా పిలుస్తారు. ఇది సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు సమాచారం. ఇక్కడి నుండే మసూద్ అజార్ భారత్ పైకి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఉసిగొల్పుతున్నాడు. పుల్వామా దాడి సహా అనేక ఇతర ఉగ్ర దాడులకు పథకాన్ని రచించింది ఇక్కడే.
అయితే భారత సైన్యం సూసైడ్ డ్రోన్ల సహాయంతో జరిపిన దాడిలో మసూద్ కుటుంబ సభ్యుల్లో పది మంది మరణించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరితో పాటు మరో నలుగురు సన్నిహితులు కూడా మరణించారు. ఇందులో మసూద్ సోదరి-ఆమె భర్త, మేనల్లుడు-అతడి భార్య, మేన కోడలు మరణించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మసూద్ అజార్ ఒక లేఖను విడుదల చేయడం గమనార్హం. కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా చనిపోతే బాగుండు అంటూ లేఖలో అతడు పేర్కొన్నాడు. అలాగే భారత ప్రభుత్వం అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లగించిందని అతడు వాపోయాడు. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ పిచ్చి ప్రేలాపణలు చేశాడు.