Nepal gets first female PM after deadly unrest | ‘జెనరేషన్-జెడ్’ ఉద్యమంతో హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ వ్యవస్థ సమూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వ అస్థిరత, అవినీతి, వారసత్వం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా అక్కడి యువత ఉద్యమం బాట పట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాధినేతలు రాజీనామాలు చేశారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌదెల్ మరియు ఆర్మి చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్, జెన్-జి ప్రతినిధులతో భేటీ అయ్యారు. సుధీర్ఘ చర్చల అనంతరం సుశీల కర్కి పేరు ఖరారు అయ్యింది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు నేపాల్ అధ్యక్ష కార్యాలయంలో సుశీల కర్కితో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుశీల కర్కి అధికారులతో కీలక భేటీలో పాల్గొన్నారు. అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా ఎమర్జెన్సీ సిఫారసు చేశారు. అలాగే 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన చేశారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ కోసం కృషి చేయనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
కాగా నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా చరిత్ర సృష్టించిన సుశీల కర్కి ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా కూడా బాధ్యతలు స్వీకరించడం విశేషం. భారత్ లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో సుశీల కర్కి డిగ్రీ పూర్తి చేశారు. అలాగే భారత ప్రధాని నరేంద్రమోదీతో సత్సంబంధాలు ఉన్నట్లు ఇటీవలే ఆమె పేర్కొన్నారు.










