Ministers Seethakka and Konda Surekha Meet’s KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ను మేడారం మహా జాతరకు అధికారికంగా ఆహ్వానం పలికింది రాష్ట్ర ప్రభుత్వం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఈ సందర్భంగా మహిళా మంత్రులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను మంత్రులు ఆహ్వానించారు.
సమ్మక్క-సారాలమ్మ బంగారాన్ని, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావలసిందిగా ఆహ్వానించారు. ఆహ్వానాన్ని కెసిఆర్ స్వీకరించారు. మేడారం జాతరకు వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా అతిథి మర్యాదలతో మహిళా మంత్రులకు పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో కేసీఆర్ దంపతులు సత్కరించారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు సమ్మక్క-సారాలమ్మ మహా జాతర జరగనున్న విషయం తెల్సిందే.










