Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > ‘జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం’

‘జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం’

seethakka pressmeet

  • నూతన చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతాం
  • అదా నీ అంబానీ వంటి కార్పొరేట్లకు కారు చౌకగా కూలీలను సరఫరా చేసేందుకు నూతన చట్టం
  • ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే  

Minister Seethakka Pressmeet | గాంధీ భవన్‌లో (Gandhi Bhavan) ఏఐసీసీ కార్యదర్శి కొప్పుల రాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క జాతీయ ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిదేనని ఆమె స్పష్టం చేశారు. వలసలను అరికట్టేందుకు, వెట్టి చాకిరి నుంచి గ్రామీణ ప్రజలను విముక్తి చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరు తొలగించడం ద్వారా బీజేపీ మరోసారి గాంధీని హత్య చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పని దినాలను తగ్గిస్తూ, గ్రామీణ కూలీల సొంత ఊర్లో పని చేసే హక్కును కాలరాస్తోందని అన్నారు. కార్పొరేట్ల మైనింగ్ అవసరాలకు తక్కువ కూలీకి కార్మికులను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

ఈ చట్టం రద్దయితే గ్రామాల్లో ఉపాధి లేక కూలీలు కార్పొరేట్ల దోపిడీకి గురవుతారని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం బిక్ష కాదని, హక్కుగా లభించాల్సిన పథకమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నాలుగేళ్ల కష్టంతో రూపొందించిన చట్టాన్ని నాలుగు గంటల చర్చ కూడా లేకుండా కొత్త జీ–రామ్–జీ చట్టంగా తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.

గతంతో పోలిస్తే కోట్లాది పని దినాలు తగ్గించారని, 125 రోజుల పని అనే ప్రకటన పూర్తిగా బోగస్ అని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలు, ఎస్సీ–ఎస్టీలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందని, తెలంగాణలో మహిళల భాగస్వామ్యం 62 శాతం, ఎస్సీఎస్టీలతో కలిపితే సుమారు 90 శాతం ఉందని తెలిపారు.

కరోనా కాలం లో చదువుకున్న యువతకు కూడా ఉపాధి కల్పించిన ఘనత ఈ చట్టానిదేనని గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

జీ రామ్ జీ చట్టాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.  27 లేదా 28 తేదీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులకు మంత్రి సీతక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పేదల హక్కులను హరించే మోడీ ప్రభుత్వ కుట్రలను ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కొని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions