Owaisi Warns Pakistan | పహల్ గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) పాకిస్తాన్ (Pakistan)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అణుయుద్ధ బెదిరింపులు, కశ్మీర్లో అమాయకుల హత్యలపై పాకిస్తాన్ను నేరుగా లక్ష్యంగా చేసుకొని ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలతో హెచ్చరించారు. పాకిస్తాన్ను ‘ఐసిస్ (ISIS) వారసులు’గా అభివర్ణించారు ఒవైసీ.
పాకిస్తాన్ ఉప ప్రధాని హనీఫ్ అబ్బాసీ (Hanif Abbasi) భారత్పై అణుదాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ తనదైన శైలిలో బదులిచ్చారు. అణు వార్హెడ్లు సిద్ధంగా ఉన్నాయని బెదిరించడం కాదని, భారత్ను బెదిరించే స్థాయిలో పాకిస్తాన్ లేదని స్పష్టం చేశారు.
కేవలం 130 అణు వార్హెడ్లు ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్ తనకున్న ఏకైక బలాన్ని ప్రదర్శించాలని చూస్తోందన్నారు. కానీ భారత సైనిక, ఆర్థిక బలం ముందు అది ఏమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు.
వాస్తవాలను అంగీకరించకుండా భారత్తో యుద్ధానికి తొందరపడొద్దని పాకిస్తాన్ కు చురకలు అంటించారు. పొరుగు దేశంలో అమాయకులను చంపుతుంటే ఎవరూ మౌనంగా ఉండరని, దాని పర్యవసానాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే భారత్ సహించదని, అవసరమైతే ఇతర మార్గాల్లో ప్రతిస్పందించడానికి వెనుకాడదని హెచ్చరించారు.