Indian woman detained for 8 hours at US airport | అమెరికాలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి భారత వ్యాపారస్థురాలు, చాయ్ పాని ఫౌండర్ శ్రుతి చతుర్వేది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల వ్యవహార శైలిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 30 న శ్రుతి అమెరికాలోని అలస్కాకు వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాలను సందర్శించి తిరిగు పయనమయ్యారు. అయితే అలస్కాలోని ఆంకరేజ్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో హ్యాండ్ బ్యాగ్ లో ఓ పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనను అడ్డుకున్నట్లు ఆమె వివరించారు.
విమానాశ్రయంలో ఎనిమిది గంటల పాటు పోలీసులు మరియు ఎఫ్బీఐ అధికారులు తనను నిర్బంధించినట్లు పేర్కొన్నారు. తనను ఒక పురుష అధికారి కెమెరా ముందు శారీరకంగా తనిఖీ చేశారని, వెచ్చదనం కోసం ధరించిన దుస్తుల్ని తొలగించమని చెప్పినట్లు తెలిపారు.
దుస్తులు, మొబైల్ ఫోన్, వాలెట్ను తొలగించి చల్లని గదిలో ఉంచారని, ఎనిమిది గంటల పాటు రెస్ట్రూమ్కు వెళ్లనివ్వలేదని ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా అనుమతించలేదని ఆరోపించారు. ఈ నిర్బంధం వల్ల తాను ప్రయాణించాల్సిన విమానాన్ని మిస్ అయినట్లు పేర్కొన్నారు.