Harish Rao fires on T Govt | సంగారెడ్డి: పటాన్ చెరు(Pathancheru) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి (Gudem Madhusudan Reddy) ని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పటాన్చెరు పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao).. మహిపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే కాంగ్రెస్ పని అయిపోయిందని ధ్వజమెత్తారు.
“పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన ఏమైనా బంధిపోటా?
FIR కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. బెయిల్ వచ్చే సెక్షన్ల తో కేసులు ఉన్నా ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనుకుంటున్నారు.
ప్రజలకి సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో మేం దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అక్కడ క్రషర్లు ఉన్నాయి. వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయి.
BRS నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు పెట్టారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. గ్రామాల్లో తాగు నీరు రావట్లేదు. పంటలు ఎండిపోతున్నాయి ఇవి పట్టించుకోరు. ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం. మా పార్టీ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్ లోకి రావాలని బెదిరిస్తున్నారు. పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీశ్ రావు.